. . . యువకుడిపై కత్తి, రాడ్లతో దాడి
. . . నిజామాబాద్ ఆసుపత్రికి క్షతగాత్రుడు
. . . ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
నందిపేట్, బతుకమ్మ :
నందిపేట్ మండల కేంద్రంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిపై కొందరు మారణాయుధాలతో విరుచుకుపడిన ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. నందిపేట్ గ్రామ రాజ్నగర్కు చెందిన పెయింటర్ షేక్ నయీం (30) పై ఆదివారం ఉదయం కత్తులు, ఇనుప రాడ్లతో మూక ఉమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దారుణంలో బాధితుడి తల, చేతులు, కడుపు లో తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం అక్కడ అత్యవసర చికిత్స అందుతోంది. బాధితుడి వదిన వసీమ బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. షేక్ తారిఖ్, తాహెర్, సాజిద్, షాహిద్, గాలిబ్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ వెల్లడించారు. పాత కక్షల నేపథ్యంలోనే ప్రతీకారంతో ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. దాడికి దారితీసిన అసలు కారణాలు, ఇతర పూర్తి విషయాలు పోలీసుల లోతైన దర్యాప్తులో తెలియాల్సి ఉంది. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు.

