. . . యాప్ పోవాలి బాపు రావాలి అని ప్రజలంటున్నారు
. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
పేదల ఇళ్లను కూల్చివేయడమే లక్ష్యంగా ‘హైడ్రా’ సంస్థ పనిచేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి హిట్లర్ పాలనను స్ఫూర్తిగా తీసుకుని పేదలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అతను కాలగర్భంలో కలిసిపోయాడని రేవంత్ కు అది గతి పడుతుందని విమర్శించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు, సర్ అవగాహన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దుర్గం చెరువు, హిమాయత్ సాగర్, ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, మంత్రి గడ్డం వివేక్ ఇళ్లను ముట్టుకోని హైడ్రా, పేద ప్రజల ఇళ్లను మాత్రం కనీసం సామాన్లు, పిల్లల పుస్తకాలు సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.పైగా హైడ్రా కూల్చివేతలను హిట్లర్ నియంత పాలనతో, ఇరాన్ ఇరాక్ యుద్ధంతో రేవంత్ రెడ్డి పోల్చుతున్నాడని.. నియంతల వ్యవహరించిన హిట్లర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని, చరిత్ర రేవంత్ రెడ్డిని క్షమించదని హెచ్చరించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు ఒక ఫోన్ కాల్తో తమకు కావలసిన యూరియా బస్తాలను నేరుగా పొలాల వద్దకే ఆటోలలో తెప్పించుకునే సులభతరమైన సౌకర్యం ఉండేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యాప్’ విధానం వల్ల రైతులు యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాప్ ద్వారా ఒక రైతుకు కేవలం నాలుగు బస్తాల కంటే ఎక్కువ యూరియా లభించడం లేదని, 5 ఎకరాల రైతుకు 20 బస్తాల యూరియా కావాలంటే నాలుగు విభిన్న ప్రాంతాలకు తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. అందుకే ప్రజలు యాప్ పోవాలి . . . బాపు రావాలని కోరుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు కనురెప్ప వేసినంత సేపు కుడా కరెంట్ పోకుండా నిరంతరాయంగా, నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ లభించేదని, నాణ్యమైన విద్యుత్ సరఫరా వల్ల మోటార్లు కాలిపోయే సమస్యే ఉండేది కాదన్నారు . కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరఫరా కేవలం 6 నుండి 11 గంటలకే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వం మళ్లీ ప్రమాదంలో పడిందని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఏ ఒక్క ఆంధ్రా నాయకుడు కూడా తెలంగాణ వైపు కన్నెత్తి చూడలేదని, నేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ ఆంధ్రా పాలకులు గద్దలు తెలంగాణ, హైదరాబాద్పై వాలుతున్నాయని విమర్శించారు. పవన్ కళ్యాణ్,బక్కని నరసింహులు వంటి నాయకుల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. కొంతమంది పోలీస్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారి బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని, ‘ఎవ్రీ డే ఈజ్ నాట్ సండే’ అని వారు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రేపు వచ్చేది మళ్లీ కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అతిగా ప్రవర్తించే అధికారులపై వడ్డీతో సహా చక్రవడ్డీ కలిపి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులను వేధిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు హద్దులు దాటితే అంతకు రెట్టింపు బదలా తీర్చుకుంటామని హెచ్చరించారు.

. . . నేను రూరల్ లోనే ఉంటాను . . . బాన్సువాడ అనేది తప్పుడు ప్రచారం : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
ప్రజలు ఆదరించి నన్ను గెలిపించిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఓటర్లకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిదని నేను రూరల్ ను వదిలివెళ్తున్నానని, బాన్సువాడ అనేది తప్పుడు ప్రచారమని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన అభివ`ద్దిని పోల్చుకుని ప్రజలు బాధపడుతున్నారని, ఇప్పుడు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారని బాజిరెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆగడాలు మితిమీరుతున్నాయని బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన భయపడవద్దని వారికి నేను అండగా ఉంటానని అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనని ఇప్పటికి ప్రజలు కేసీఆర్ ఉన్నాడన్నట్లుగానే ఊహించుకుంటున్నారని అన్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా నియోజకవర్గంలో ప్రజలు తమ సమస్యలను నాతోనే మొర పెట్టుకుంటున్నారని బాజిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ళయినా, పెన్షన్లు అయినా, గ్రామ సమస్యలు అయినా తనకే ఫోన్ చేసి సమస్య తీర్చాలని కోరుకుంటున్నారని అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనని , ఎవరు బాధపడవద్దని, ప్రజలకు ఎళ్లవేళాల అండగా ఉంటానని బాజిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ గిర్దావర్ గంగారెడ్డి, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ సుమన రెడ్డి, బాజీరెడ్డి జగన్, నిజామాబాద్ రూరల్ నియోజకర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

