. . .జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎకరం భూమి కేటాయింపు
కామారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయ భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నిరంతర కృషి, పట్టుదల ,ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం ఒక ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించింది.140 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు శాశ్వత కార్యాలయ భవనం లేకపోవడం కార్యకర్తలకు ఒక లోటు గా ఉండేది. ఈ అంశాన్ని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, జిల్లా కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయం , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లతో పలుమార్లు చర్చించి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయం అవసరాన్ని వివరించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిసర ప్రాంతంలో అడ్లూర్ శివారులో సర్వే నెంబరు 527/42/1/2లో ఒక ఎకరం ప్రభుత్వ భూమిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం నిర్మాణం కోసం కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే సహకరించిన జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
