. . . జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సాయాగౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కన్యకా పరమేశ్వరి మాత దేహ త్యాగం ద్వారా సహనము, శాంతిని ప్రబోధించారని, స్త్రీ శక్తి ఔన్యత్యాన్ని చాటారని జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సాయాగౌడ్ అన్నారు. వైశాఖ శుక్ల పక్ష దశమిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఆదివారం వాసవీ మాత కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి, వాసవీ మాత కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి పూలమాల వేశారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోందని, ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున అధికారికంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించిందని అన్నారు. అన్ని వర్గాల వారి ఉత్సవాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, వాసవి క్లబ్ ప్రతినిధులు, వైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

