నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరం సంబంధించిన బడ్జెట్ ను శనివారం ప్రవేశపెట్టారు. నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో తొలి బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 341,71,43000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నగర పాలక సంస్థ కమిషనర్ బడ్జెట్ వివరాలను సభా సదులకు వివరించారు. నగరపాలక సంస్థ తొలి బడ్జెట్ సమావేశానికి ఇలా త్రిపాటి, ధన్ పాల్ సూర్యనారాయణ, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. 2025-26 బడ్జెట్ రూ. 331 కోట్లు ఉండగా, నూతన ఆర్థిక సంవత్సరం 341.71 కోట్ల బడ్జెట్ ను ఆమోదించారు. బడ్జెట్ ఆదాయవ్యయాలను నూతన బడ్జెట్ ను ఆమోదించినట్టు తెలిసింది. తొలుత సమావేశం ప్రారంభం కాదని కార్పొరేషన్ లో పరిచయ కార్యక్రమం తో పాటు దివంగత కార్పొరేటర్ లను గుర్తు చేసుకుని వారికి శ్రద్ధాంజలి ఘటించారు. కార్పొరేటర్లు ఆయా పార్టీల కండువాలను ధరించి సమావేశంలో పాల్గొన్నారు. తొలిసారి బడ్జెట్ సమావేశానికి సగానికి పైగా మహిళలే కార్పొరేటర్లుగా హాజరు కావడం విశేషం.

. . . కార్పొరేషన్ లో జిరాక్స్ లకు రూ.20 లక్షల బిల్లా?
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బడ్జెట్ సమావేశాల్లో బల్ధియా అధికారులు జిరాక్స్ కోసం రూ.20 లక్షల బిల్లును పెట్టడం చూసి అందరూ షాక్ కు గురయ్యారు. ప్రధానంగా ఇంచార్జి పాలనాధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిరాక్స్ లకు రూ.20 లక్షల వ్యయం చేయడం సరికాదని మిషన్లు కొనుగోలు చేయాలని సూచనలు చేశారు. వ్యయాలను తగ్గించుకుని ఆదాయ మార్గాలను పెంచుకోవాలని సూచించారు.

. . . ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం లా కనపడుతుందని, దీనిపై కచ్చితంగా పూర్తి వివరణ ఇవ్వాల్సిందేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఆయా పన్నుల్లో చాలా తేడా ఉందని వాటిని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశానికి ముందు, ఒక అవగాహన సమావేశం నిర్వహిస్తే బాగుండని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానంగా నగరపాలక సంస్థ ఉద్యోగులకు, సిబ్బందికి కార్పొరేటర్లు అంటే విలువ లేకుండా పోయిందన్నారు. ఏదైనా సమస్యలపై దరఖాస్తులపై సంప్రదిస్తే స్పందించడం లేదని తెలిపారు. చిన్న జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో సుందరీకరణ జరుగుతుందని, కానీ నిజామాబాద్ లో మాత్రం జరగడం లేదన్నారు. మొత్తం 30 కోట్లు అంటే ప్రతి డివిజన్ కు రూ.50 లక్షల నిధులు ఉంటాయన్నారు, కానీ అవి ఖర్చు కావడం లేదని పేర్కొన్నారు.

. . . నగర అభివృద్ధికి నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నగర అభివృద్ధికి అవసరమైన నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పారదర్శకతతో పనులు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై కీలక సూచనలు చేశారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్ట్రీట్లైట్లు వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే సేవలను వేగవంతం చేయాలని, ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నగరస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా నిజామాబాద్ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, బడ్జెట్లో ప్రతిబింబించే విధంగా ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

