. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బూతు స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రత్యేక ఇంటెన్సివ్ పునః పరిశీలన (ఎస్ ఆర్ ఐ)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ, లక్ష్యం మేరకు మ్యాపింగ్ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా బూతు స్థాయి అధికారుల, ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అధికారులకు మ్యాపింగ్ ప్రక్రియ విధివిధానాలను సూచించారు. పది రోజుల్లోగా 80 శాతం లక్ష్యం మేరకు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ను వేగవంతం చేసి పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక సూచనలు చేశారు. జిల్లాలో బూత్ స్థాయి అధికారులను ప్రతి ఇంటిని సందర్శించి మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మసకతో కూడిన ఫోటోలు, లాజికల్ ఎర్రర్స్, మార్పులను గుర్తించి సరిచేసుకోవాలని తెలిపారు. డబుల్ వున్న ఓట్లను గుర్తించి వాటి తొలగింపుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 6, 7, 8 ఫారాల పెండింగ్ లేకుండా చూడాలన్నారు. గుర్తింపు కార్డులు లేని బూత్ స్థాయి అధికారులకు కార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పట్టణ, గ్రామ స్థాయిలలో మెరుగ్గా పనిచేసినట్లయితే మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి అవుతుందని, దీనిపై తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మ్యాపింగ్ లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
