. . . ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సులో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మార్చి 6 నుండి జూన్ 12 వ తేదీ వరకు చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేయడం కొరకు జిల్లా కలెక్టర్ ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నప్పటికీ ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి చిత్తశుద్ధితో పనిచేయడం లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ ధ్వజమెత్తారు. నిజామాబాద్ నగర శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్లో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధుల అవగాహన సదస్సులో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడతూ కేవలం కలెక్టర్ మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ప్రభుత్వం నుండి కావలసిన వసతులు సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నప్పటికీ ఆయా శాఖలో ఉన్నతాధికారులు మాత్రం కిందిస్థాయి సిబ్బందికి కార్యక్రమ పనులు అప్పజెప్పి చేతులు దులుపుకోవడం విచారకరమన్నారు.

అన్ని శాఖల ముఖ్య అధికారులు కలసికట్టుగా పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు పూర్తిస్థాయిలో జిల్లాలో ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలలోకి చేరకపోవడం ఉన్నతాధికారుల బాధ్యతారహితమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నప్పటికీ ఆయా శాఖలలో ఉన్న ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల కిందిస్థాయి సిబ్బంది సేవలు గుర్తించకపోవడం విచారకరమన్నారు. ప్రజా పాలన ప్రగతి పాలన అంటే సమాజ అభివృద్ధి అని మరీ ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని ఇందులో పరిసరాల పరిశుభ్రత ఎక్కడ కూడా కనిపించడం లేదన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రగతి సాధించినట్లని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆ దిశగా సానిటేషన్ అధికారులు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా జరగాలని, నగర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, నగర మేయర్ ఉమా రాణి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

