. . . ఎర్రజొన్న రైతులను దోచుకుంటున్న వ్యాపారుల సిండికేట్ పై కఠిన చర్యలు తీసుకోవాలి
. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
రైతులను నిలువుగా దోచుకుంటున్న వ్యాపారుల సిండికేట్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి లేఖ అందజేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, ఇందూర్ రూరల్ నియోజక వర్గాల్లో రైతులు పెద్ద ఎత్తున ఎర్రజొన్న పంటను సాగు చేస్తున్నారని, కానీ ప్రస్తుత సీజన్ లో మార్కెట్ లో వ్యాపారస్తులందరూ కుమ్మక్కై రూ.4000 వరకు మద్దతు ధర ఉన్నప్పటికి ఈ సిండికేట్ మూలంగా ధరను అమాంతం రూ.3300 కు తగ్గించి రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారన్నారు. రైతులను ముంచడం, వారి కష్టాన్ని అడ్డగోలుగా దోచుకోవడం సిండికేట్ వ్యాపారులకు ఒక దందాగా మారిందని, గత్యంతరం లేక చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఇప్పటికే సుమారు 20 శాతం పంటను తక్కువ ధరకే విక్రయించి తీవ్రంగా నష్టపోయారని, దీనిని అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, మార్కెటింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో మార్కెట్లో దళారులదే రాజ్యంగా మారిందని ఆయనన్నారు. కలెక్టర్ వెంటనే సంబందిత వ్యాపారస్తులు మార్కెటింగ్ అధికారులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే విధంగా వారు పండించిన పంటకు అత్యధిక ధర దక్కేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరుతున్నారు.

