నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం బోధన్ ఎల్ఐసి ఐసీఈయు కార్మిక సంఘం ఉద్యోగులు చేపట్టిన సమ్మె విజయవంతమైందని ఈసీఈయు బోధన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు సక్కి సత్యనారాయణ తెలిపారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) నేతృత్వంలో ఐసీఈయు బీమా ఉద్యోగులు బీమా చట్ట సవరణలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా గురువారం ఈ సమ్మె తలపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి 3, 4 నియామకాలు చేపట్టాలని 1996 నియామక నోటిఫికేషన్ ప్రకారం ఎల్ఐసీలో చేరిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఎంఎస్ 57 అనుసరించి 1995 గ్యారంటీ పింఛను పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. 2010 ఏప్రిల్ 1 తరువాత ఎల్ఐసీలో చేరిన ఉద్యోగులకు 1995 గ్యారెంటీ పింఛను అమలుచేయాలన్నారు. లేబర్ కోడ్ పేరుతో కార్మికులను ఉక్కుపాదంతో అణిచివేసే చట్టాలను తీసుకువస్తుందని, విదేశీ పెట్టుబడులను ఎల్ఐసి లో ప్రోత్సహిస్తూ సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలను చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఐసియు నాయకులు ఆర్ నరసయ్య, రాకేష్, సంతోష్, గంగారాం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

