. . . గోదాం వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన
రుద్రూర్, బతుకమ్మ :
యూరియా కొరత రైతులను వేధిస్తూనే ఉంది. డిమాండ్కు తగిన యూరియా సకాలంలో రాకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంలో సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో గోదాం వద్ద యూరియా కోసం వివిధ గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ రుద్రూర్ గ్రామం పెద్ద చెరువు అని, ఈ చెరువు కింద 2 వేల 600 ఎకరాలు రైతులు వరి పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. గోదాంకి 200 యూరియా బస్తాలు వస్తే అవి రైతులకు ఎలా సరిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం సొసైటీల చుట్టూ, గోదాంల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నామన్నారు. ఎకరం పంటకు మూడు బస్తాలు యూరియా అవసరం ఉంటుందని, గోదాంలలో యూరియా సకాలంలో అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు మండిపడ్డారు. అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని రైతుల కోరారు.
