నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గత 4 దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాలలో కామ్రేడ్ యాదగిరన్న పాత్ర మరువలేనిదని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. నగరంలోని కోటగల్లి శ్రామిక భవన్ వద్ద శనివారం సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరన్న ప్రథమ వర్ధంతి సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సుదీర్ఘకాలంగా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన యాదగిరన్న ప్రథమ వర్ధంతి సభను పార్టీ అర్బన్, రూరల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్, వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామన్నారు. నిజాంసాగర్, సింగూరు జలాలకై జరిగిన పోరాటానికి కామ్రేడ్ యాదగిరన్న నాయకత్వం వహించాడని, జిల్లాలో కార్మిక, రైతాంగ పోరాటాలకు మార్గదర్శనం చేశాడన్నారు. కామ్రేడ్ యాదగిరన్న ప్రథమ వర్ధంతి సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, కే.రమ తదితరులు ముఖ్య వక్తలుగా హాజరవుతున్నారన్నారు. పార్టీ శ్రేణులు, విప్లవాభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ప్రథమ వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సంధ్యారాణి, టియుసిఐ జిల్లా నాయకులు బి.లింగం, టి.విటల్, డి.గంగాధర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
