ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో శుక్రవారం విస్తృత పర్యటనలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా దేవునిపల్లి గ్రామంలో నల్ల పోచమ్మ తల్లి ఆలయం సమీపంలో నిర్మించనున్న ఫంక్షన్ హాల్కు సంబంధించి రూ.10 లక్షల నిధుల ప్రొసీడింగ్ కాపీని గ్రామ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో తీవ్రంగా వెనుకబడిందన్నారు. ఒక దశలో “ఎల్లారెడ్డి అంటే ఎక్కడి నియోజకవర్గం?” అని అపహాస్యం చేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం అసెంబ్లీ సాక్షిగా ఎల్లారెడ్డి సమస్యలపై తొలిసారి గళమెత్తి, అభివృద్ధికి అవసరమైన నిధులను మంత్రులతో పోరాడి తీసుకొస్తున్నానని తెలిపారు. గత పాలకుల హయాంలోని ఎల్లారెడ్డికి, ప్రస్తుతం ఉన్న ఎల్లారెడ్డికి ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. ఇప్పుడు ఎల్లారెడ్డి పట్టణం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఎల్లారెడ్డి పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేసినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.

