నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశ ప్రేమికుల రోజుగా ప్రకటించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి వేడుకలు ఆల్ ఇండియా ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నిస్వార్థంగా బ్రిటిష్ నిరంకశ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ప్రపంచ దేశాలు తిరుగుతూ భారతదేశ విముక్తి కోసం ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించి, రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం బ్రిటిష్ సైన్యంలో ఉన్న భారతీయ సైన్యంతో తిరుగుబాటు చేయించి బ్రిటిష్ పాలకులను చావు దెబ్బ తీసారని, దేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించి, తొలి ప్రోగ్రెస్ యు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇవ్వలేదు, స్వాతంత్రాన్ని మనం ప్రకటించుకున్నాం అని గర్వంగా చెప్పుకున్న మహా నాయకుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. కానీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక అమెరికా, బ్రిటిష్ కుట్రలు ఉన్నాయని తెలిసినప్పటికీ ఇప్పటివరకు భారత ప్రభుత్వాలు విచారణ సక్రమంగా చేయలేదని, దేశానికి స్వతంత్రాన్ని ఇచ్చిన సుభాష్ చంద్రబోస్ కు సరైన గౌరవం దక్కలేదన్నారు. ఆయన జయంతి రోజు సెలవు ప్రకటించి, దేశ ప్రేమికుల రోజుగా దేశ పౌరులకు దేశం పట్ల అభిమానాన్ని నూరి పోసే విధంగా కార్యక్రమాలు చేయాలని ఆయన అన్నారు.

