. . . పాలిటెక్నిక్ మైదానంలో వాకింగ్ ట్రాక్ పనులను ప్రారంభించిన షబ్బీర్ ఆలీ, ధన్ పాల్, మహేష్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ
నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు కోసం 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అభివృద్ధిని చూపిస్తోందని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరాభివృద్ధి కోసం ఇప్పటికే 10 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను (ఎస్ డీఎఫ్ ఫండ్స్) మంజూరు చేయించామని దీని ద్వారా డివిజన్ల వారీగా రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అమృత్ పథకం కింద రూ.300 కోట్లతో నిజామాబాద్ నగరంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.గత ప్రభుత్వం పట్టించుకోని సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తోందని, నిజామాబాద్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ పరమావధి అని స్పష్టం చేశారు. నిజామాబాద్ పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం పాలిటెక్నిక్ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు, క్రీడాకారులకు, సామాన్య ప్రజలకు ఈ మైదానం ఎంతో ఉపయోగకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా పనిచేస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి నా వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులున్నారు.

