హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని నల్లకుంటలో దారుణం జరిగింది. పిల్లల ముందే భర్త అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా హుజురాబాద్కు చెందిన దంపతులు వెంకటేష్, త్రివేణి నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. కాగా, వెంకటేష్ తరచూ భార్యను అనుమానిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. తాజాగా భర్త వేధింపులు తాళలేక భార్య త్రివేణి పుట్టింటికి వెళ్లింది. దీంతో అక్కడకు వెళ్లిన వెంకటేష్.. తాను మారానని, నమ్మించి త్రివేణిని హైదరాబాద్కు తీసుకొచ్చాడు. ఎప్పటిలాగే అనుమానంతో భార్యతో గొడవకు దిగిన వెంకటేష్.. విచక్షణ మరిచి ఆమెపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసి ఇద్దరిని కూడా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే త్రివేణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కూతురు స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించారు. కేవలం 12 గంటల్లోనే వెంకటేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . తల్లి కోసం చిన్నారులు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
