నిజామాబాద్, బతుకమ్మ : ప్రజా సమస్యల మీద ముఖ్యమంత్రిని కలిసి అవకాశం ఇవ్వాలని, లేని చో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జిల్లానుంచి తిరిగి వెళ్లనివ్వమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులచారి హెచ్చరించారు. శుక్రవారం నిజామాబాద్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆర్ఓబి, నిజామాబాద్ సమస్యల మీద వినతి పత్రం అందజేయడం కోసం బీజేపీ కార్యాలయం నుంచి పార్టీ కార్యకర్తలతో బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వినతి పత్రం అందజేసేందుకు బీజేపీ పార్టీ అధ్యక్షులు దినేష్ కులచారి ఒకరికే పర్మిషన్ ఉందని మిగతా వారు వెళ్లడానికి అవకాశం లేదని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో మాధవ నగర్ ఆర్ఓబి, మామిడిపల్లి ఆర్ఓబి, అర్సపల్లి ఆర్ఓబి పనులు వెంటనే పూర్తి చేయాలని, జిల్లా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వకుంటే ముఖ్యమంత్రిని తిరిగి వెళ్లనివ్వమంటూ హెచ్చరించారు.

