వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఖతార్ తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి కవిత ఉత్సాహంగా బతుకమ్మ ఆడి పాడారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ బిడ్డలు బతుకుదెరువు కోసం బొగ్గుబాయి.. దుబాయికి పోయిండ్రు అని చెప్పుకునేటోళ్లమన్నారు. ఇక్కడికి వచ్చిన వారి కష్టాలు మాకు తెలుసని.. తల్లిదండ్రులు, కుటుంబాలను విడిచిపెట్టి ఇక్కడ క్యాంపులల్లో ఉంటూ వచ్చే జీతంలో ఎంతో కొంత మిగిల్చి ఇంటికి పంపుతున్నారని పేర్కొన్నారు. మనసుల్లో ఎంత దుఃఖం ఉంటదో తెలుసని, ఆ దుఃఖం తీరాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. త్వరలోనే మీరంతా తెలంగాణ కు వచ్చే మంచి రోజులు రావాలని, ఇక్కడే ఉన్నా బాగుండాలని కోరుకుంటున్నని తెలిపారు. ఏ పండుగ వచ్చినా అక్కడ ఉన్న మీ కుటుంబానికి మీరు గుర్తుకు వస్తారని తెలియజేశారు. నా మనసుకు కష్టంగా, బాధగా ఉందని, జీవితంలో కొన్ని సందర్భాలు వ స్తాయని, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మనోడైనా.. మందోడైనా న్యాయం, ధర్మం ఎటు ఉందో చూడాలని వెల్లడించారు. మీరు మనసుల మానది ఏం పెట్టుకోకండని, మా సంగతి ఎట్లున్నా తెలంగాణ ప్రజలు బాగుండటం, తెలంగాణ హక్కులను రక్షించడం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడడమే ఊపిరిగా పని చేస్తానని పేర్కొన్నారు.

