నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ మరియు వర్కర్స్ యూనియన్ (సి ఐ టీ యూ) జిల్లా కమిటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు పోలీస్ నిర్బంధాన్ని దాటుకొని డి పి ఓ కార్యాలయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్, కార్మికులకు మద్దతుగా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి కొండా గంగాధర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల వివక్షతతో వ్యవహరిస్తోందన్నారు. మూడు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోతే ఎట్లా బ్రతకాలని వారు ప్రశ్నించారు. వెంటనే బకాయి వేతనాలు విడుదల చేయాలని, పండుగకు ఇవ్వాల్సిన బట్టలు, నూనెలు, చెప్పులు, ఇతరత్ర వస్తువులు వెంటనే ఇవ్వాలని, ఇన్స్యూరెన్స్, పి ఆఫ్ ,ఈ ఎస్ ఐ వంటి సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ కు వినతి పత్రం అందించారు. సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలు తమ పరిధిలో ఉన్నవాటిని వెంటనే పరిష్కరిస్తామని, వేతనాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇచ్చేవిధంగా ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాగర్, రేఖ ఆంజనేయులు, సాయిలు, పద్మ, పోశెట్టి, గంగారాం, లక్ష్మి, గంగామణి దీవెన,సునీత తదితరులు పాల్గొన్నారు.

