- ఎమ్మెల్యే మదన్ మోహన్
నాగిరెడ్డిపేట, బతుకమ్మ: రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవలందించిన మహానాయకుడు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువ భారత నిర్మాణానికి పునాదులు వేసిన దూరదృష్టి కలిగిన నేత అని కొనియాడారు. ఆయన సాంకేతికత, విద్య, పంచాయతీరాజ్ వ్యవస్థ బలానికి చేసిన కృషి భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి నడిపించిందని తెలిపారు. దేశంలో ఐటీ విప్లవానికి ఆయన వేసిన బీజాలు ఈ రోజు మన దేశాన్ని ప్రపంచానికి తెలియజేసే స్థాయికి తీసుకువచ్చాయన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలు నేటి యువతకు ప్రేరణగా నిలవాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.
