- బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్
బతుకమ్మ, బిచ్కుంద : రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటి ప్రయాణాలు పేట్టుకోవద్దని బిచ్కుంద మండల తాసిల్దార్ వేణుగోపాల్ తెలియజేశారు. నిరంతరం కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని పోలీస్ యంత్రాంగం 24గంటలు అందుబాటులో ఉంటారని, సహాయం కోసం డయల్ 100కి లేదా రెవెన్యూ సిబ్బందికి,దగ్గరలో ఉన్న పంచాయతీ సిబ్బందికి సమాచారం అందిస్తే నిమిషాల్లో తక్షణ సహాయక చర్యలు చేపడతామని, తాసిల్దార్ వేణుగోపాల్ అన్నారు. మంజీరా పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలాశయాలు, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ఎవరు వెల్లద్దని, మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదన్నారు. గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశ లలో, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే పరిస్థితిలో ఉంటే పోలీస్ వారికి సమాచారం అందిస్తే సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా రోడ్లపై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని తాసిల్దార్ పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఇతర శాఖల అధికారులతో, ప్రజల సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు, స్తంబాలు, ట్రాన్స్ఫార్మర్లకు ప్రజలు దూరంగా ఉండాలి, అలాగే తడి చేతులతో స్విచ్ బోర్డులు ముట్టకోవద్దని సూచించారు. ప్రజలందరూ ఈ వర్షా కాలంలో పోలీస్ , రెవిన్యూ సిబ్బంది వారి సూచనలు, సలహాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
