- ఆసుపత్రి ఎదుట మృతుని కుటుంబీకుల ఆందోళన
బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు మృతి చెందడంతో, అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయాడని వారు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.బిచ్కుంద మండల శాంతాపూర్ గ్రామానికి చెందిన భాను ప్రసాద్(16)కు మంగళవారం రాత్రి జ్వరం రావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో పరిస్థితి విషమించినప్పటికీ పట్టించుకోలేదని.. ఉదయం నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని పేర్కొన్నారని బాధితులు ఆరోపించారు. దీంతో బాలుడిని వెంటనే నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బాలుడి మృతదేహాన్ని బాన్సువాడకు తీసుకెళ్లి ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ అశోక్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సముదాయించారు.

