. . . పసుపు బోర్డు సాధనకు పాదరక్షలు ధరించకుండా ఉద్యమం
. . . ఎర్రజొన్న బకాయిల కోసం తిరుపతి వరకు పాదయాత్ర
బతుకమ్మ, మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు నేత మనోహర్ రెడ్డి అకాల మరణం చెందారు. శనివారం హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామ వాస్తవ్యులు గతంలో పాలెం సర్పంచిగా ఎన్నికై ప్రజలకు సేవలందించి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. ఆర్మూర్ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసేంత వరకు చెప్పులు వేసుకొనని శపథం చేసి దానిని ఆచరించారు. 10 సం.లు. చెప్పులు ధరింకుండానే రైతు ఉద్యమంలో పాల్గొన్నారు. ఇటీవల పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాన మంత్రి ప్రకటన చేసిన తర్వాత నే పాదరక్షలు వేసుకున్నారు. ఆర్మూర్ ప్రాంత రైతులకు రావాల్సిన ఎర్రజొన్న బకాయలు రూ.11 కోట్లు ఇవ్వాలని తిరుపతికి పాదయాత్ర చేసిన రైతు ప్రేమికుడు. అనేక రైతు ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యమ నాయకుడు కన్నుమూయడంతో రైతులు మంచినాయకున్ని కోల్పోయినట్లయింది. మనోహర్ రెడ్డి అంత్యక్రియలు ఆర్మూర్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
