అరుణాచలంలో ఘటన
వెబ్ న్యూస్, బతుకమ్మ : తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ (32) అనే వ్యక్తి శుక్రవారం వేకువజామున గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు అతడిని ఢీకొట్టారు. కింద పడిన విద్యాసాగర్ యువకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన యువకులు తమ వద్ద ఉన్న కత్తితో అతడిపై దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్ ని తోటి భక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను తిరువణ్ణామలైకి చెందిన గుగనేశ్వరన్, తమిళ రసన్ లుగా గుర్తించి అరెస్టు చేశారు.
