- ఓబీసీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డి.రాజా నరేందర్ గౌడ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చారిత్రాత్మక నిర్ణయమని ఓబీసీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డి.రాజా నరేందర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయం అని అన్నారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. 2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన “సామాజిక విప్లవానికి నాంది”గా అభివర్ణించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన “జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి” అన్న డిమాండ్ను దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు పరచేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టి.పి.సి.సి. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు రుణపడి ఉంటామని తెలిపారు.