- ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సంగారెడ్డి, బతుకమ్మ : సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని, ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సిగాచి పరిశ్రమలో గాయపడి పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంగళవారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులకు ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలన్నారు. ఫ్యాక్టరీ లో ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు పని చేస్తున్నారో కూడా చెప్పడం లేదన్నారు. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుల్లో మైనర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోందన్నారు. ప్రభుత్వం దీనిపై నిజానిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
