- ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధరలను నిర్ణయంచేసి ప్రకటించిందని, ధాన్యం పండించిన అన్నదాతను ఆదుకోలేని, మద్దతు గా నిలబెట్టలేని మద్దతు ధరలు ఉన్నాయని అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్ లో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భూమయ్య మాట్లాడుతూ వ్యవసాయంలో పంటల పెట్టుబడి ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయని సంవత్సరానికి 10 నుంచి 12% పెరుగుతుంటే మద్దతు ధరలు మాత్రం మూడు శాతానికి పెరగడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసినా విధంగా ధాన్యానికి ధరలు పెంచలేదని కేవలం వరికి క్వింటాలుకి 69 రూపాయలు పెంచి చేతులు దులుపుకున్నారని అన్నారు. దేశంలో వరి పంట దిగుబడి లో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని అలాంటి పంటకు 69 రూపాయలు పెంచడంలో ఔచిత్యం ఏమిటని భూమయ్య అన్నారు. మద్దతు ధర నిర్ణయించడం లో ప్రభుత్వాలు రైతుల పెట్టుబడులను, రైతు శ్రమను, శాస్త్రీయంగా గుర్తించడం లేదని ,స్వామినాథం సూచనలు అమలు పరచడం లేదని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయ రెడ్డి, జిల్లా నాయకులు బి.సాయిలు, గంగాధర్, బి.బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
