- టీపీడీఎంఏ అధ్యక్ష కార్యదర్శులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు ప్రభుత్వము చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన అనేక డిగ్రీ కళాశాలలు అచేతన స్థితిలో ఉంటూ సుమారు 50 శాతం పైగా డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయని టీపీడీఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డా.సూర్యనారాయణ రెడ్డి, యాద రామక్రిష్ణ తెలిపారు. విద్యార్థులకు చేరువలో నాణ్యమైన విద్య అందించాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఈరోజు ప్రభుత్వ విధానాల ద్వారా విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. యాజమాన్యాల పట్ల మృత్యుగంటికలు మోగిస్తుందని తెలిపారు. ఈ పరిస్థితులలో భవన యజమానులు తమ అద్దె కోసం, ఉద్యోగులు తమ జీతాల కోసం ఎన్నో నెలలుగా ఇబ్బందులు పడుతూ ప్రస్తుత తరుణంలో ఎట్టి పరిస్థితిలో మా జీతాలు చెల్లించకపోతే సహకరించమని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. యాజమాన్యాలు విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించినప్పుడే ఈ పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా అన్ని శాఖలకు పంపినప్పటికీ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల14 నుండి యూనివర్సిటీలు ఇచ్చిన షెడ్యూలు పరీక్షల నిర్వహణ అనేది ప్రభుత్వం ఈ రెండు మూడు రోజులలో స్పందించి కళాశాలల ఎకౌంట్లో బకాయిలు జమ చేసినట్లయితే పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. లేనిపక్షంలో ఉద్యోగులు సహకరించక యాజమాన్యాలు ఆశక్తులుగా నిలువవలసి ఉంటుందని హెచ్చరించారు.
