హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఈనెల 10వ తేదీన మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీందర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈవెంట్ జరిగే ప్రాంతాల్లో వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీదారుల భద్రతకు మహిళా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాచకొండ, హైదరాబాద్ ,సైబరాబాద్ కమిషనరేట్స్తో సహా మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించే జిల్లాల్లో హైసెక్యూరిటీ కల్పించనున్నారు. ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీనియర్ పోలీసు అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
