బతుకమ్మ,వేల్పూర్ :-మండలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు జంగం అశోక్ గ్రామానికి అందించిన సేవలు అభినందనీయమని గ్రామస్తులు పొగిడారు. 35 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందించిన జంగం అశోక్ పదవీ విరమణ చేసిన సందర్భంగా సోమవారం జాన్కంపేట గ్రామంలో గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన స్నేహితులు గ్రామస్తులు మాట్లాడుతూ ఆయన గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. చదువుతోనే భవిష్యత్తు ఉంటుందని అందరూ చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని ఎల్లప్పుడూ గ్రామస్తుల అభివృద్ధి కోరుకున్నాడని పేర్కొన్నారు. స్నేహితులతో కలిసి గ్రామంలో ప్రగతి యువజన సంఘాన్ని స్థాపించి గ్రామంలో అభివృద్ధి పనులకు నాంది పలికారని పేర్కొన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా గాని అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ముందు ఉండేవారన్నారు. గ్రామ విద్యార్థులను, తాను పనిచేసిన గ్రామాలలోని పాఠశాలల విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేశారన్నారు. చిన్న గ్రామమైన జన్కంపేట లో ఎంతోమంది ఉద్యోగాలు సాధించడానికి ప్రేరణగా నిలిచారన్నారు.
