బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ వృద్దుల కమ్యూనిటీ భవనంలో మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ అధ్యక్షతన ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్త గా విచ్చేసిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విపుల్ జైన్ మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక రకమైన ఎన్నిక జరగటం వల్ల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వలన పాలన ఇబ్బందికరంగా మారటమే కాకుండా ప్రజలపై ఆర్థిక భారం కూడా పడుతుందన్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ప్రవేశ పెట్టీ రాజకీయ అస్తిత్వాన్ని పోగొట్టమే కాకుండా ఆర్థికంగా కూడా భారతదేశాన్ని ప్రథమ స్థానంలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ తో సహా కొన్ని ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికలపై అసత్య ప్రచారం చేస్తున్నారని అందుకే గత పార్లమెంట్ సమావేశాల్లో జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలు, న్యాయవాదులు, న్యాయమూర్తులు అన్ని రంగాల మేధావుల సలహాలు సూచనలు తీసుకొని సమగ్ర సమాచారంతో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటున్నారని ఈ లోగా ప్రజలకు జమిలీ ఎన్నికల పై అపోహలను తొలగించే బాధ్యత బీజేపీ కార్యకర్తల పై ఉందన్నారు. సోషల్ మీడియా , మీడియా, ప్రజా క్షేత్రంలో ప్రతి బీజేపీ కార్యకర్త ఈ విషయంపై అవగాహన కలిగి ఉండటమే కాకుండా ప్రజలకు లాభాలు వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బిజెపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
