- అవసరమున్న చోట వేయకుండా.. లేని చోట వేస్తున్న వైనం
- ఇంటి ముందుకే సీసీ రోడ్లు
- స్పందించని ఏఈ
రుద్రూర్, బతుకమ్మ: సీసీ రోడ్లు స్థానిక రాజకీయ లబ్ధి కోసమేనా?.. అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం గల్లిలో ఏకంగా ఒక్కొక్క ఇంటి ముందర సీసీ రోడ్లు వేయడం వెనకాల మతలబు ఏమిటని కాలనీ ప్రజల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంటి వాకిట్లో కూడా సీసీ రోడ్లు వేయడం పట్ల ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు. అంబం గల్లి నుండి జేఎన్సీ కాలనీ ప్రాంతంలో ప్రధాన వీధులు, గల్లీలు, అలాగే స్మశాన వాటిక పోయే రోడ్డు అధ్వాన్నంగా మారిందని, రోజుకు ఎంతో మంది ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు ఈ దారి పైనే రాకపోకలు కొనసాగిస్తుంటారు. స్మశానానికి వెళ్లాలంటే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే గుంతలు, బురద మాయమై రోడ్డు అధ్వానంగా తయారవుతాయి. అవసరమైన చోట సీసీ రోడ్డు వేయకుండా.. అవసరం లేని చోట సిసి రోడ్లు వేస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అలాగే దుర్కి గల్లీలో మరుగుదొడ్లకు వెళ్లే దారిలో సీసీ రోడ్లు వేయడం ఎంతవరకు సమంజసమని పలువురు వాపోతున్నారు. ఈ సీసీ రోడ్లు స్థానిక రాజకీయ లబ్ధి కోసమేనా?.. అని కాలనీ ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి రాజకీయాల కోసం స్థానిక నాయకులు సిసి రోడ్లు వేస్తున్నారంటే అవసరం ఉన్న దగ్గర వేయకపోవడం ఎంతవరకు సమంజసమని ఈ విషయం పై సంబంధిత ఉన్నత అధికారులు, ప్రభుత్వం స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వివరణ కొరకు ఏఈ పవన్ కు చరవాణిలో సంప్రదించగ, ఏఈ ఫోన్ లేపకపోవడం గమనార్హం.
