ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెయూ రిజిస్ట్రార్ కు వినతి
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలో రహస్యంగా విడుదల చేసిన అతిథి అధ్యాపకుల ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం వారు తెయూ రిజిస్ట్రార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రఘురాం, అంజలి మాట్లాడుతూ గతనెల 24న వెలువడ్డ అతిథి అధ్యాపకుల ప్రకటన లోపభూయిష్టంగా ఉందన్నారు. తెలుగులో -02, ఇంగ్లీష్ లో -01, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ-01, సోషల్ వర్క్-01, మొత్తం 5 ఖాళీలతో వెలువడిన ఈనోటిఫికేషన్ ప్రకటనలో క్విడ్ ప్రో కో స్కాం జరిగినట్లుగా అనుమానాలకు తావు ఇస్తోందని ఆరోపించారు. ఈనోటిఫికేషన్ ను యూనివర్సిటీ ఉపకులపతి పేరు మీదుగా విడుదల చేశారని, అందులో నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తున్నారు, ఎక్కడ విడుదల చేస్తున్నారు, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, విద్యార్వతలు ఏమేం ఉండాలనే వివరాలు లేవన్నారు. ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు లాంటి అనేక రకాల సమాచారం లేదన్నారు. ఈనిరుద్యోగ ప్రకటనను రద్దుచేసి మరల అన్ని వివరాలతో కూడిన కొత్త ఉద్యోగ భర్తీ ప్రకటనను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈవిషయమై ఉన్నత విద్యా మండలి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ కో కన్వీనర్ సంజయ్, నాయకులు అజయ్, గౌతమ్, విజయ్, దినేష్ పాల్గొన్నారు.
