. . . క్షమాపణలు కోరిన వైనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ ఉత్తర మండల తహసీల్ధార్ వివాదంలో చిక్కుకున్నారు. రేషన్ కార్డులో పేరులను తొలగించాలని తహసీల్ధార్ ను కలిసిన మైనార్టీ యువకులను దూషించి వివాదాన్ని కొనితెచ్చుకున్నారు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ నార్త్ మండలానికి చెందిన ఇద్దరు మైనార్టీ యువకులు నార్త్ మండల తహసీల్ధార్ నాగార్జున వద్దకు రేషన్ కార్డులో పేర్లను తొలగించాలని కలిసారు. అయితే తమను మతం పేరుతో తిట్టి, టోపిలు పెట్టుకుని తిరుగుతూ ఎక్కువ మంది పిల్లలను కంటారని, రేషన్ బియ్యం అమ్ముకుంటారని దూషించారని ఆరోపించారు. ఈ విషయంపై మైనార్టీ యువకులు మజ్లీస్ నాయకులకు తమకు జరిగిన అవమానంపై గోడును వెళ్లబోసుకున్నారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫయాజ్, మాజీ కార్పొరేటర్ షహజాజ్ లు నార్త్ తహ సీల్ధార్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మార్వోను నిలదీశారు. దానికి స్పందించిన ఆయన మైనార్టీ యువకులకు క్షమాపణలు చెప్పారు. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
