బీర్కూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతు నగర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి గుళ్ళ పోశవ్వ, అనుమవ్వ ఇంటి ఎదుట క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. వీరిద్దరి ఇంటి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పిండితో చేసిన బొమ్మలు, నిమ్మకాయలు పెట్టి పసుపుతో ముగ్గులు వేశారు. గత వారం రోజులుగా రైతు నగర్ గ్రామంలో కొంతమంది ఇళ్ల ముందు గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ఈ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కూడా ఇదే తరహాలో మరొకరి ఇంటి ముందు క్షుద్ర పూజలు చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. ఈనెల 27వ తేదీన అమావాస్య ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. ఇప్పటికైనా పోలీసులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తులను పట్టుకోవాలని కోరుతున్నారు.
