- పేదల గుడిసెలకు అభయ హస్తం అందించేదెవరు..?
- రియాల్టర్ల వెనకున్న అభయహస్తం ఎవరిది..?
- పేదలు గుడిసెలు వేసిన స్థలం కబ్జాకు యత్నాలు
నిజామాబాద్, బతుకమ్మ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ శివారులో సర్కార్ భూమిపై రియాల్టర్ల కన్ను పడింది. చెంతనే కలెక్టరేట్ ఉండడం, బైపాస్ కు సమీపంలో ఉండడంతో సంబంధిత భూమిని చెరబట్టేందుకు సిద్దమయ్యారు. 2018 నుంచి పేదలు నివాసం ఏర్పాటు చేసుకున్న స్థలాన్ని కబ్జాకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నగర శివారులోని సర్వే నంబర్ 171,172లో నాలుగు ఎకరాల పది గుంటల ప్రభుత్వ భూమి ఉంది. దానిలో పేదలు ఇళ్ళు కట్టుకుని ఉంటుండగా పక్కనే పంచాయితీరాజ్ రిటైర్డ్ టీచర్లు సర్వే నంబర్ 171లో 13 ఎకరాల 30 గుంటల భూమిలో 8 ఎకరాల 10 గుంటల భూమిలో వెంచర్ ఏర్పాటు చేసుకున్నారు.మిగిలిన భూమి సర్కార్ భూమి అని రిటైర్డ్ టీచర్లే ప్రకటించారు. కానీ ఇప్పుడు అక్కడ కబ్జాకు మళ్ళీ ప్రయత్నాలు మొదలయ్యాయి.

అభయహస్తం కాలనీ పేరిట సర్కార్ భూమిలో పేదలు గుడిసెలు, రేకుల ఇళ్ళలో ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిజామాబాద్ లో పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డికి అభయహస్తం కాలనీ పేదలు తమకు సంబంధిత భూమిలో పేదలకు పక్కాఇళ్ళు నిర్మించాలని వినతి పత్రం ఇచ్చారు. అనాడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్ళను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అక్కడ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ రూ.10 లక్షలు మంజూరు చేయగా ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోడల్ కాలనీ ఏర్పాటు చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రికి జూపల్లికి కూడా వినతి పత్రాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల అభయహస్తం కాలనీలో గుడిసెలు వేసుకున్న వారిపై వేదింపులు

పెరిగాయి. ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టా భూములలోని భూమిని సర్కారు సర్వేనంబర్ లలో ఉందని కొత్త నాటకం మొదలుపెట్టారు. వారికి పోలీసు శాఖ కూడా వత్తాసు పలుకడం గమనార్హం. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేయడం గమనార్హం. భూ వివాదంలో కోర్టులో కేసులు నడుస్తుండగా సివిల్ పంచాయితీలో పోలీసులు కలుగజేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
- ప్రజావాణిలో అభయహస్తం కాలనీవాసుల ఫిర్యాదు
అభయస్తం కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు ద్యారంగుల కృష్ణప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ లు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకుపంచాయతీరాజ్ టీచర్లకు వత్తాసు పలికే పద్ధతుల్లో నిజామాబాద్ ఏసిపి కాలనీ ప్రజలకు నాయకత్వం వహిస్తున్న నాయకులను ఆయన కార్యాలయానికి పిలిచి హెచ్చరించారన్నారు.
ఇరువాదనలు వినాలని విన్నవించినప్పటికీ ఏకాపక్షంగా వారికి మద్దతు తెలపడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో తమంతట తామే గుడిసెలు తొలగించాలని లేకపోతే కేసులు బనాయించి జైలుకు పంపుతామని హెచ్చరించారన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి అభయ హస్తం కాలనీ ప్రజలకు తగిన న్యాయం చేయాలని కోరారు.

