నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆరు గ్యారంటీలో అమలు కోసం పూర్తిగా రుణమాఫీ, రైతు భరోసా అమలు కోసం ఫిబ్రవరి 20న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య కోరారు. డిచ్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆకుల పాపయ్య మాట్లాడినారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్సు తప్ప, మిగతావి అమలు పూర్తి కాలేక ప్రజలను అయోమయంలో గురిచేస్తుందని అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి కింద నెలకు 2500, కౌవులు రైతులతో సహా రైతులందరికీ రైతు భరోసా 15000 వేయాలని అన్ని రకాల పంటలకు 500 బోనస్ ఇవ్వాలని, ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, తెలంగాణ సాధన ఉద్యమకారులకు 250 గజాల స్థలము, చేయుత పథకం కింద వృద్ధులకు 4000 రూపాయల పింఛను, కళ్యాణ్ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం, యువ వికాసం పేరిట విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల విద్య భరోసా కార్డులు ఇవ్వాలని పాపయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలను సవతి తల్లి ప్రేమ చూపుతుందన్నారు. రాష్ట్రల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. విద్యుత్ సవరణ బిల్లును తీసుకువస్తుందని దీనివల్ల రైతులు కరెంటు ఉచితంగా అందే బదులు బోరు బావుల వద్ద మీటర్లు పెట్టి రైతు వద్ద ముక్కు పిండి చార్జీలు వసూలు చేసే ప్రయత్నం చేస్తుందని దీనివల్ల రైతాంగం మెడకు ఇది ఉరితాడులా వేలాడుతుందని వారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచాలని డిమాండ్ తో తేదీ 20-02-2025న చలో హైదరాబాద్ సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ పాపయ్య కోరారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, న్యూ డెమోక్రసీ డిచ్పల్లి మండల కార్యదర్శి జెపి గంగాధర్, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రియ, సాయినాథ్, గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు.
