తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ
కామారెడ్డి, బతుకమ్మ : షరతులు లేకుండా బీడీ కార్మికులకు రూ.4వేల పింఛన్ అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం కొత్త బస్టాండ్ వద్ద గల సి ఎస్ ఐ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం భారీ ప్రదర్శన కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ హాజరై మాట్లాడారు. 2023 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు ఇస్తున్న జీవన భృతి పెన్షన్ 2016 రూపాయల నుండి చేయూత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు పెంచి ఇస్తామని కొత్తగా దరఖాస్తు చేసుకున్న బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినప్పటికీ ఎన్నికల హామీని అమలు చేయకపోవడం కార్మికులను నిరాశపరిచిందని, ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేయూత పథకం ద్వారా జీవన భృతి పెన్షన్ ప్రతినెల 4 వేల రూపాయల చొప్పున అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేయూత పథకం ద్వారా బీడీ పరిశ్రమలో గల బీడీలు చుట్టే కార్మికులకు బీడీ ప్యాకర్లకు నెలసరి జీతాల ఉద్యోగులందరికీ చేయూత పథకం ద్వారా ప్రతి ఒక్కరికి పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పెన్షన్ను అమలు చేయకపోతే భవిష్యత్తులో బీడీ కార్మికుల అందరిని ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాట నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటి, కామారెడ్డి బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రకాష్, బాలరాజు, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు జి సురేష్, వీడియో వర్కర్స్ యూనియన్ నాయకులు సాయ గౌడ్, సాయికుమార్, మురళి, గంగారాం, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

