నిజామాబాద్, బతుకమ్మ: శివాజీ నగర్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం పండ్ల వ్యాపారుల బండ్లను తగలబెట్టిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మువ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రతినిధులు శుక్రవారం నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) వెంకట్ రాజశేఖర్ను కలిసి ఫిర్యాదు అందజేశారు. పండ్ల వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారని, ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళనలు, అభద్రతా భావం నెలకొందని MPJ నిజామాబాద్ అధ్యక్షుడు మొహమ్మద్ జహీరుద్దీన్ అన్నారు. సమాజంలో శాంతి-భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకట్ రాజశేఖర్ మాట్లాడుతూ, నిందితులను త్వరితగతిన గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ శాఖ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహాసభ జిల్లా అధ్యక్షుడు కేస్పల్లి రవి, దళిత నాయకులు, ఎంపీజే నాయకులు షేక్ హుస్సేన్, సజ్జద్, పండ్ల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
శివాజీ నగర్లో పండ్ల బండ్లు తగలబెట్టిన ఘటనపై నిజామాబాద్ ఏసీపీకి ఎంపీజే ప్రతినిధుల ఫిర్యాదు
