– సమగ్ర సర్వే కు ప్రజలు సహకరించాలి
– సంక్షేమ పథకాల అమలు కొరకే సర్వే
– కస్తూర్బా గాంధీ స్కూల్ సమస్యలు పరిష్కరిస్తా
– మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బతుకమ్మ, నవీపేట్ : సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కొరకు పనిచేస్తుందని, సన్నరకం వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ, కుల గణన సర్వే చేపడుతుందని, ప్రజలు ఎన్యుమలేటర్లకు సహకరించి సమాచారం అందించాలని కోరారు. సోమవారం నవీపేట్ లో పర్యటించారు. ముందుగా మొకన్ పల్లి లోని కస్తూర్బా గాంధీ పాఠశాలను డీఈవో అశోక్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు బోధిస్తున్న తీరును పరిశీలించి, విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి జవాబులు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలని ఉపాధ్యాయినులకు ఆదేశించారు. స్కూల్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

తదనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 85 కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. మండల కేంద్రంలోని సుభాష్ నగర్ లో జరుగుతున్న సర్వే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ , కుల సర్వే పై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని, వాస్తవ సమాచారం ఇచ్చి సర్వే సిబ్బందికి సహకరించాలని తెలిపారు. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ సర్కారు చేయని పనులను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి చూపారని తెలిపారు.

గతంలో లక్ష రుణమాఫీ కొరకు 4 సంవత్సరాల సమయం పడితే సీఎం రేవంత్ రెడ్డి 1 సంవత్సరం లోనే 2 లక్షల రుణమాఫీ చేశారని, మిగతా రైతులకు త్వరలోనే పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తామని, సన్నరకం వరికి 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ సర్కారు 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ కె. రాజేంద్ర కుమార్, తహసీల్దార్ వెంకట రమణ, ఎంపీడీఓ నాగనాథ్, మండల రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

