- వైద్యులు, సిబ్బందిని అభినందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, బతుకమ్మ : వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు 24 గంటల వ్యవధిలో వరుసగా 20 శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వైద్య బృందాన్ని, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ దిశగా ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునిక పరికరాలు, సిబ్బంది, వసతులతో బలోపేతం అవుతున్నాయని తెలిపారు. వేములవాడ ఆసుపత్రి వైద్యులు చూపిన నిబద్ధత ప్రశంసనీయం అని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి సమయానికి చికిత్స పొందేలా వైద్యులు మరింత కృషి చేయాలని విప్ సూచించారు. ఆధునిక వైద్య సేవలతో పాటు శుభ్రత, రోగి సేవ ధోరణిలో కూడా ఈ ఆసుపత్రి ఆదర్శంగా నిలవలన్నారు. వైద్య విభాగం పర్యవేక్షకుడు డాక్టర్ పెంచలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తికావడం పట్ల వైద్యులను సహాయక సిబ్బంది అందరికీ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
