- కాపాడిన దేవునిపల్లి పోలీసులు
- అభినందించిన జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ : కుటుంబ కలహాలతో కుంటలో దూకిన మహిళను దేవునిపల్లి పోలీసులు కాపాడిన ఘటన సోమవారం రాజీవ్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. దేవునిపల్లి పోలీసులు తమ ధైర్యం, చాకచక్యం, సేవా ధ్యేయంతో ఒక మహిళ ప్రాణాన్ని కాపాడి ఆదర్శంగా నిలిచారు. కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనోవేదనకులోనైన మహిళ, రాజీవ్ నగర్ కాలనీ సమీపంలోని కుంటలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడ ఉన్నవారు చూసి కుంటలో ఎవరో దూకి మునుగుతున్నట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే దేవునిపల్లి పోలీస్ స్టేషన్ రెండవ ఎస్ఐ భువనేశ్వర్, కానిస్టేబుల్ బాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని, నీటిలో అపస్మారక స్తితిలో ఉన్న మహిళను బయటకు తీసి ప్రాథమిక చికిత్సలో భాగంగా కడుపులోని నీటిని బయటకు తీయడం ద్వారా ఆమె ప్రాణాలను రక్షించి, భద్రంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒక మహిళ ప్రాణాలను సాహసోపేత చర్యల ద్వారా కాపాడిన ఎస్ఐ భువనేశ్వర్, కానిస్టేబుల్ బాలకృష్ణను జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర క్యాష్ రివార్డ్ తో ప్రత్యేకంగా అభినందించారు.
