- జిల్లాలో సమాచార కమిషనర్ పర్యటన
- ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం
నిజామాబాద్, బతుకమ్మ : సమాచార హక్కు చట్టం -2005 ఫైళ్ళు జిల్లాలో గుట్టలుగా పేరుకపోయాయి. గత ప్రభుత్వ హయంలో సమాచార హక్కు చట్టం -2005ను అటకెక్కించారు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కొందరు వేగులు (సహ చట్టం కార్యకర్తల)పై దాడులు, కేసులు నమోదైన విషయం విధితమే. సమాచార హక్కు చట్టంపై దరఖాస్తుదారులు అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో అప్పిలెట్(సెకండ్ అప్పిల్) అధికారులకు ఫిర్యాదు చేసినా అవి బుట్టదాఖలయ్యాయి. ఏకంగా కమిషనర్ కు ఫిర్యాదు చేసినా ఫైళ్ళకు మోక్షం లభించలేదు. కనీసం సమాచార కమిషనర్ లు జిల్లాలో పర్యటించింది లేదు ఫైళ్ళను క్లియర్ చేసింది లేదు. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించిన ఫలితం దక్కని పరిస్థితి నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్నీ కార్పొరేషన్లకు కొత్త పాలకమండళ్ళను నియమించిన విషయం తెల్సిందే. సమాచార కమిషనర్ లతో పాటు డైరెక్టర్ల నియామకం కూడా జరిగింది. సమాచార కమిషనర్ గా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ డా.చంద్రశేఖర్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సమాచార కమిషనర్ పర్యటన ఖరారు అయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సమాచారం అందింది. త్వరలోనే ఉమ్మడి జిల్లాలో పర్యటించి సమాచార హక్కు చట్టంపై సమీక్షించనున్నారు. ఈ మేరకు పంచాయితీ, మండల, రెవెన్యూ, మున్సిపాలిటీలకు సంబంధించిన పీఐఈవోలకు అప్రమత్తం చేయాలని ఆదేశాలందాయి. అదే విధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టంకు సంబంధించిన బోర్డుల ఏర్పాటును అధికారుల వివరాలను తెలుపుతూ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఆర్టీఐ నోడల్ ఆఫీసర్ల నియామకంతో పాటు పెండింగ్ లో ఉన్న సమాచార హక్కు చట్టం ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అందినట్లు తెలిసింది.
నిజామాబాద్ జిల్లాలో సమాచార హక్కు చట్టం ఫైళ్ళ దుమ్ము దుళిపేందుకు అధికారుల సమాయత్తం అయ్యారు. దాదాపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన కమిషనర్ పర్యటన నేపథ్యంలో అధికారులు పెండింగ్ ఫైళ్ళ కోసం కసరత్తును చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 433 ఫైళ్ళు పెండింగ్ లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే కమిషనర్ కు 81 యాక్టు కింద ఫిర్యాదు చేసినవే 127 ఫైళ్లు ఉన్నాయి. సెకండ్ ఆఫీళ్ళు కింద 306 ఫైళ్ళు ఉన్నాయని అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే సమాచార హక్కు చట్టం అమలును కొన్ని శాఖలు విస్మరించాయని ఆరోపణలున్నాయి. కనీసం పిఐఈవో బోర్డులను ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొంది. పోలీసు శాఖతో పాటు విద్యాశాఖ, రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్యశాఖలలో ఫైళ్ళను క్లియరెన్స్ చేయకుండానే పెండింగ్ లో ఉంచారని అవన్ని కలిపితే వేలల్లో దరఖాస్తులు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. తొలిసారి కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారయంత్రాంగం పాత ఫైళ్ళ దుమ్ము దూలుపుతారా? లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే చాలా శాఖలలో పీఐఈవోలకే సమాచార హక్కు చట్టం -2005పై అవగాహన లేదనే విషయం అందరికీ తెలిసిందే. కనీసం సమాచారానికి రిప్లే ఇవ్వడం లేదని వారి కారణంగానే సెకండ్ ఆపీళ్ళతో పాటు కమిషనర్ కు ఫిర్యాదులు, కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సమాచార హక్కు చట్టాన్ని పొందే పరిస్థితి నెలకొంది.


