కామారెడ్డి, బతుకమ్మ : భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలో భర్తకు ఏడేళ్ల శిక్ష విధిస్తూ న్యాయ స్థానం తీర్పునిచ్చినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దేవుని పల్లి గ్రామానికి చెందిన గొల్ల భార్గవికి గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామానికి చెందిన ముక్కర శ్రీనివాస్ తో మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్త అదనపు కట్నం కోసం వేధించేవారు. ఈ విషయంలో పలుమార్లు పంచాయితీ చేసినప్పటికీ శ్రీనివాస్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. బాబు పుట్టిన తరువాత భార్గవిని అత్తగారింటికి పంపించారు. కానీ వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో భార్గవి విషం తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని రోజులకు మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు భార్గవి మరణానికి కారణమైన భర్త శ్రీనివాస్, అత్త లక్ష్మీలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి శ్రీనివాస్ కు ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
