- ఓటు బ్యాంకు కోసం రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి
- బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమే నని, రాజ్యాధికారం కోసం పోరాడకపోవడం వల్లనే బీసీలకు ఈ దుస్థితి నెలకొందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ అన్నారు. శనివారం ప్రెస్ క్లబ్ లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రౌంట్ టేబుల్ సమావేశం జిల్లా అధ్యక్షులు ఎం.నాగయ్య ఉపాధ్యక్షులు అల్లుల్ల నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ మాట్లాడుతూ..రాజ్యాధికార సాధనకై బీసీ గోర్ఖాలను తయారుచేస్తున్నామన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలదీ అవకాశవాద రాజకీయమేనని, జాతీయ పార్టీలు ఓబీసీలను అమాయకులను చేసి మోసపూరిత విధానాలను అనుసరిస్తున్నాయన్నారు. సమాన వాటా కోసం హక్కుల కోసం పార్టీ టిక్కెట్ల కోసం సంక్షేమ పథకాల కోసం ఏ పార్టీ కోసం ఎదురుచూసేది లేదని, చేయిచాచి అడిగేది లేదని, ఇక బరిగీసి కొట్టాడుడే మార్గమన్నారు. దేశరాజకీయలను ప్రభావితం చేసే స్థాయికి అధికారం కట్టబెట్టడంలో బీసీ వర్గాలే నేడు కీలకంగా మారాయని, ఒక పార్టీ కులగణన అంటూ, మరో పార్టీ చేయబోమని ఒకటి తెగేసి చెబుతున్నదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసినా ఆ కులగణన నివేదికను బయటపెట్టకుండా మోసం చేసి, ఇప్పుడు మళ్లా చేస్తామంటూ మాట్లాడతున్నది ఇంకో పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణన పై సరైన పర్యవేక్షణ అవసరమన్నారు. బీసీలంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.రాజ్యాధికారమే జెండా, ఎజెండాగా ముందుకు సాగాలన్నారు. త్వరలో అన్ని మండలాలలో మండల స్థాయిలో అన్ని బీసీ కుల సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాలు* నిర్వహిస్తామన్నారు.