ఎస్సార్ ఎస్పీ కాకతీయ లక్ష్మి కాల్వకు నీటి విడుదల
బతుకమ్మ, మెండోరా : యాసంగిలో పంటలకు నీటిని అందించడానికి సాగునీటి పారుదల శాఖ ప్రణాళిక ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలాశయం కాకతీయ కాలువ, స్థానిక నిజామాబాద్ జిల్లాకు నీరు అందించే లక్ష్మీకాలువ రెండు కాలువల ద్వారా బుధవారం ఉదయం 10:30 గంటలకు నీటి విడుదలను ప్రారంభిస్తున్నట్లు ప్రాజెక్ట్ ఏఈఈ కొత్త రవి తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా 4,38,394 లక్షల ఎకరాలు, లక్ష్మీ కాలువ చౌట్పల్లి హనుమత్ రెడ్డి ఎత్తిపోతల పథకం రెండిటి ద్వారా 35,000 ఎకరాలు, అలీ సాగర్, గుప్త ఎత్తిపోతల పథకం ద్వారా 80,000 ఎకరాలకు నీటిని అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 80.053 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలాశయంతో పాటు చెరువులు చెక్ డ్యాములు జలకళ సంతరించుకున్నాయి. పూర్తి ఆయకట్టుకు నీరు అందించే దిశగా నీటిపారుదల శాఖ కసరత్తు మొదలు పెట్టింది. డిసెంబర్ 25 తేదీన ప్రారంభమై ఏప్రిల్ 8 వరకు సాగునీటి విడుదల వారబంధి గా (వారం రోజులు నీటి విడుదల వారం రోజులు నీటి విడుదల నిలుపుదల) కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.

