. . . ఇసుక అమ్ముకొనే ఊర్లు ఉన్నాయ్ ఆ ఊర్ల నుండి ఇసుక తీసుకుపోండ్రి
. . . మా ఊరి వనరులు మావే… ఇసుక తరలిస్తే ఊరుకోము
. . . భూగర్భ జలాలు అడగంటుతాయి.. ఇసుక తరలించద్దు
. . . వేల్పూర్ రైతుల ధర్నా, తహసీల్దార్ కు వినతి
వేల్పూర్, బతుకమ్మ
మా ఊరి వాగు నుండి ఇతర ఊర్లకు ఇసుక ఇవ్వడం కుదరదని మా ఊరి ఇసుక మాదేనని ఇంకో ఊరి ఇసుక ఇవ్వమని వేల్పూర్ రైతులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మన ఊరు మన ఇసుక వాహనం కింద మండలంలో మూడు పాయింట్లను ప్రభుత్వం ఇవ్వగా అందులో వేల్పూర్ వాగును చేర్చారు. ఈ వాగు నుండి ఇతర గ్రామాల్లో ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులకు ఇసుక ఇవ్వమని రైతు లు భీస్మించు కూర్చున్నారు.

ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు అడగంటుతాయని, మా ఊరి వాగు నుండి ఇతర గ్రామాలకు ఇసుక ఇవ్వవద్దని పచ్చలనడుకుడ బ్రిడ్జి వద్ద రైతులు ఉదయం నుండి బైఠాయించారు. అక్కడికి ఇసుక తరలింపుకు వాహనాలు రాకపోగా రైతులంతా అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి బైఠాయించారు.

భూగర్భ జలాలను కాపాడాలని, ఇసుక తరలిస్తే సహించమంటూ నినాదాలు చేశారు. తహసీల్దార్ ను గెరావు చేసిన రైతులు తహసీల్దార్ జె.అనిరోద్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ మా వాగు నుండి ఎవ్వరికి ఇసుక ఇవ్వమని, తహసీల్దార్ కు తెగేసి చెప్పారు. ఈ విషయాన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. 2018 లో గవర్నమెంట్ ఇసుక పాయింట్ ఇక్కడ పెట్టడం వల్ల బోర్లు మొత్తం ఎత్తిపోయాయ్యని అప్పుడే రోడ్డును కట్ చేసి ఇసుక తరలింపు ఆపివేశామని రైతులు చేప్పారు. భూగర్భ జలాల కోసం కోట్లు ఖర్చు చేసి ఇక్కడ చెక్ డ్యామ్ లు కట్టడం జరిగిందని, ఇసుక తరలిస్తే ప్రయోజనం ఏముంటుందని రైతు లు తహసీల్దార్ ను ప్రశ్నించారు. ఇసుక అమ్ముకొనే ఊర్లల్లో ఇసుక తీసుకోపోండ్రి కానీ మేము ససేమీరా ఇసుక ఇవ్వబొమని తెగేసి చెప్పారు. రైతులను కాదని ఇసుక తరలిస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాద్యత వహించాల్సి ఉంటుందన్నారు. గ్రామంలోని ట్రాన్స్ఫర్మార్ల సంఘాల నుండి 200 మంది రైతులు వాగులో, తహసీల్దార్ ఆఫీస్ ఎదుట, రోడ్డు పై ధర్నా నిర్వహించారు.
