. . . ఫ్యూచర్ సిటీ పేరుతో బలవంతపు భూ సేకరణ సరికాదు
. . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను రైతులకు వెంటనే తిరిగి ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితడిమాండ్ చేశారు. రైతుల అనుమతి లేకుండా భూసేకరణ జరపడం అన్యాయమని ఆమె విమర్శించారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో గురువారం నిర్వహించిన “ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది?” అనే అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కవిత రైతులకు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూఫార్మా సిటీ భూసేకరణ కోసం తీసుకొచ్చిన జీవో 31ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేర్లతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. గత ప్రభుత్వం ఫార్మా సిటీ విషయంలో అబద్ధాలు చెప్పిందని, అదే విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. ఫార్మా సిటీ బాధిత రైతుల తరఫున తెలంగాణ రక్షణ సేన ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.

రైతుల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటమే మార్గమని కవిత పేర్కొన్నారు. ప్రశ్నించటం, పోరాడటం, పరిష్కరించడం తమ విధానమని చెప్పారు. వెలుగుమట్ల సమస్యలో నిరాహార దీక్ష ద్వారా బాధితులకు న్యాయం జరిగిందని గుర్తుచేశారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు రైతులతో కలిసి ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కవిత ఆరోపించారు. బుల్లెట్ ట్రైన్, డేటా సెంటర్లు, లక్షల కోట్ల పెట్టుబడుల పేరుతో అబద్ధాల పునాదిపై ప్రాజెక్టులు నిర్మించాలని చూస్తున్నారని విమర్శించారు. డేటా సెంటర్ల వల్ల కాలుష్యం, శబ్ద సమస్యలు పెరిగి పర్యావరణానికి నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ఎకరాకు రూ.8 లక్షల పరిహారం సరిపోదని, వారి జీవనోపాధి ప్రశ్నార్థకమవుతుందని అన్నారు.రైతులు పండించే ధాన్యం కొనుగోళ్లను నిలిపివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని కవిత ఆరోపించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిందని, వచ్చే ఏడాది నుంచి పంట కొనుగోళ్లు ఉండకపోవచ్చని అన్నారు. దీనిపై ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు నిజాలు చెప్పడం లేదని విమర్శించారు.ఈ సమావేశంలో ఫార్మా సిటీ భూముల సమస్యపై రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.
