25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు పోరాటం చేస్తాం

Must read

📰 Generate e-Paper Clip

  • 42శాతం రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోం
  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ

హైదరాబాద్, బతుకమ్మ : కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, హామీల అమలు కోసం పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు, విశ్వకర్మ కుల సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. తమకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతు… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను కుదేలు చేస్తున్నదని విమర్శించారు. కుల వృత్తుల వారికి ప్రభుత్వం కనీస మద్దతు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధికంగా బీసీ విద్యార్థులు లబ్దిపొందే ఫీజు రియింబర్స్ మెంట్ పూలే స్కాలర్ షిప్ పథకాల నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. బీసీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐక్యతను చాటి హామీల అమలుకు ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఫులే ఫ్రంట్ నాయకులు బొల్లా శివ శంకర్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు కొట్టాల యాదగిరి ముదిరాజ్, దాసరి నరేష్ ముదిరాజ్, నాగభూషణం ముదిరాజ్, భిక్షపతి ముదిరాజ్, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ ఫౌండర్ విశ్వనాథుల పుష్పగిరి, జాతీయ సహాయ కార్యదర్శి చొల్లేటి ప్రభాకర్, అబ్బోజు రామ్, సుధాకరాచారి, హేమ, జిల్లోజు స్థపతి, యూత్ వింగ్ కార్యదర్శి నరేష్ చారి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article