నిజామాబాద్, బతుకమ్మ: విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని సుభాష్ నగర్ లో గురువారం నిర్వహించిన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర శాఖలలో పని చేసి పదవీవిరమణ పొందిన సీనియర్ సిటిజన్స్ తమ అనుభవాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని అన్నారు. విశ్రాంత ఉద్యోగులు గుర్నాల సరోజినమ్మను ఆదర్శంగా తీసుకోవాలని, ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.
రిటైర్డ్ ఉద్యోగుల బినిఫిట్స్ ఇతర సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అలాగే విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం యోగా కేంద్రం, లైబ్రరీ ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు సమాకూర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటు చేసిన సంఘం భవనంలో ఉపయోగించేందుకు ధన్ పాల్ లక్ష్మిబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ తరఫున వంద కుర్చీలు అందజేశారు.
అనంతరం వివిధ రంగాలలో సేవలందిస్తున్న ప్రముఖులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెజరరీ డిప్యూటీ డైరెరక్టర్ దశరథ్, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

