. . . నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
వేసవిలో తాగు నీటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ సూచించారు. గురువారం కమిషనర్ పలు డివిజన్ లలో పర్యటించారు. 53వ డివిజన్ పరిధిలోని హష్మీ కాలనీ, శాంతినగర్, పీలా స్కూల్ తదితర ప్రాంతాలను కాలినడకన సందర్శిస్తూ క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న సమస్యలను పరిశీలించారు. ప్రధానంగా శానిటేషన్ నిర్వహణ, తాగునీటి సరఫరా గురించి స్థానికులను ఆరా తీశారు. అవసరమైన చోట సీ.సీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అక్కడక్కడా రోడ్లపై పేరుకుని ఉన్న చెత్త కుప్పలను గమనించి, వెంటనే తొలగింపజేయాలని ఆదేశించారు. నీటి సరఫరా తీరును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్ 9వ డివిజన్ లోని ఆయా ప్రాంతాలను సందర్శించారు. కమిషనర్ వెంట సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్ రవి బాబు, అధికారులు ఇనాయత్, సాజిద్ తదితరులు ఉన్నారు.

